POCSO Case : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ముఖ్య అనుచరుడైన రవి కుమార్ అలియాస్ రఫీపై హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది. స్థానిక జిమ్‌లో పరిచయమైన ఒక మహిళను ట్రాప్ చేయడమే కాకుండా, ఆమెతో పాటు మైనర్‌గా ఉన్న ఆమె కుమార్తెను కూడా రవి తీవ్రంగా వేధించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ కేసులో రవి కుమార్‌ను ప్రధాన నిందితుడిగా (A1), అతడి అక్రమాలకు సహకరించిన సోదరుడు రూపేష్‌ను రెండో నిందితుడిగా (A2) చేర్చి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read : ఫ్రీ ఫైర్ ఆన్ లైన్ గేమ్ వేదికగా బాలికలకు వల.. మాయగాళ్ల సరికొత్త పంథా

బాధిత మహిళతో జిమ్‌లో పరిచయం పెంచుకున్న రవి కుమార్, ఆమెను నమ్మించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు విచారణలో తేలింది. సదరు మహిళను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా.. రూ. 10 లక్షల నగదు ఇవ్వాలంటూ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే ఆమె మైనర్ కుమార్తె పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేయడంతో, తట్టుకోలేకపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో మైనర్ బాలిక రక్షణ నిమిత్తం పోలీసులు నిందితులపై కఠినమైన పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నిందితుడైన రవి కుమార్‌కు నేరపూరితమైన గతం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇతడు గతంలోనూ “నిత్య పెళ్లికొడుకు” అవతారమెత్తి పలువురు యువతులను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రేమ పేరుతో ముగ్గురు యువతులను నమ్మించి, వారితో పెళ్లిళ్లు చేసుకున్నాడని.. ఆ తర్వాత వారి వ్యక్తిగత, ప్రైవేట్ వీడియోలను రహస్యంగా చిత్రీకరించి, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గతంలోనే ఇతనిపై తీవ్రమైన ఫిర్యాదులు వచ్చాయి.

రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని రవి కుమార్ వరుస అక్రమాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఒకవైపు మహిళలను ఆర్థికంగా బ్లాక్‌మెయిల్ చేస్తూ, మరోవైపు మైనర్లపై కూడా వేధింపులకు తెగబడటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నిందితులు A1 రవి కుమార్, A2 రూపేష్‌లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన అల్వాల్ పోలీసులు, వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read : బీఆర్ఎస్‌కు భవిష్యత్తు లేదు.. మూసీలేసి తొక్కుతా: సీఎం రేవంత్ రెడ్డి..!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.