donald Trump
Citizenship Application Fee : అమెరికా పౌరసత్వం (యు.ఎస్ సిటిజన్‌షిప్) పొందాలని ఆశించే వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. పౌరసత్వ దరఖాస్తు రుసుములను ఏకంగా 75 శాతం మేర పెంచుతూ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS) తాజాగా ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇమిగ్రేషన్ నిబంధనలను నిరంతరం కఠినతరం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా పౌరసత్వ ప్రక్రియను మరింత ఖరీదైనదిగా మార్చేందుకు ఆయన కార్యవర్గం సిద్ధమవడంతో, వలసదారులపై ఆర్థిక భారం భారీగా పెరగనుంది.
తాజా ప్రతిపాదనల ప్రకారం, పేపర్ ఆధారిత (Paper-based) పౌరసత్వ దరఖాస్తు (N-400) ఫీజును ప్రస్తుతమున్న 760 డాలర్ల నుండి ఏకంగా 1,330 డాలర్లకు పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఒకవేళ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. ప్రస్తుతం ఉన్న 710 డాలర్ల రుసుమును 1,280 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ కొత్త నిబంధనలు గనుక అమల్లోకి వస్తే, అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ దాదాపు 75 శాతం అదనపు భారాన్ని భరించక తప్పదు.
కేవలం దరఖాస్తు ఫీజులే కాకుండా, సిటిజన్‌షిప్ అప్లికేషన్ తిరస్కరణకు గురైనప్పుడు చేసుకునే అప్పీలు (పునఃపరిశీలన) ఖర్చులు కూడా సామాన్యులకు భారంగా మారనున్నాయి. ఏదైనా దరఖాస్తు రిజెక్ట్ అయి, దానిపై అప్పీలు చేయాలనుకుంటే ప్రస్తుతం వసూలు చేస్తున్న 830 డాలర్ల ఫీజును ఏకంగా 1,475 డాలర్లకు పెంచాలని హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. అంటే అప్పీలు రుసుముపైనే ఒకేసారి 645 డాలర్ల మేర అదనపు వడ్డన జరగనుంది.
ఈ ఫీజుల పెంపుతో పాటు, గతంలో తక్కువ ఆదాయం ఉన్న దరఖాస్తుదారులకు లభించిన పలు రాయితీలు, మినహాయింపులను పూర్తిగా రద్దు చేయాలని డీహెచ్‌ఎస్ నిర్ణయించింది. ఫెడరల్ ఆదాయ మార్గదర్శకాల ప్రకారం.. 400 శాతం లేదా అంతకంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన పేద, మధ్యతరగతి వలసదారులకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ‘రెడ్యూస్‌డ్‌ ఫీజ్‌’ (ధర తగ్గింపు) ఆప్షన్‌ను పూర్తిగా తీసేయాలని అధికారులు ప్రతిపాదించారు. దీనివల్ల భవిష్యత్తులో దరఖాస్తుదారులు ఎవరైనా సరే ఎటువంటి మినహాయింపులు లేకుండా పూర్తి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
ఇమిగ్రేషన్ దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల వెట్టింగ్ (ధృవీకరణ) ప్రక్రియలకు అయ్యే నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఈ అదనపు ఫీజుల ద్వారా సమకూరే నిధులతో దరఖాస్తుల స్క్రూటినీ ప్రక్రియను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ట్రంప్ సర్కారు వివిధ రకాల యూఎస్ వీసా ఫీజులను పెంచిన సంగతి తెలిసిందే.
ఈ నూతన ఫీజు పెంపు ప్రతిపాదనలపై ప్రజలు తమ సలహాలు, అభిప్రాయాలను పంచుకునేందుకు ఫెడరల్ ప్రభుత్వం 60 రోజుల పాటు గడువు ఇచ్చింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ ముగిసి, ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునేంత వరకు ప్రస్తుత పాత ఫీజులే అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఈ కొత్త కఠిన నిబంధనల వల్ల అమెరికాలో సహజంగా పౌరసత్వం పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఆర్థిక స్థోమత లేని ఎంతోమంది శాశ్వత నివాసితులు (గ్రీన్ కార్డ్ హోల్డర్స్) తమ సువర్ణావకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని వలసదారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.