
Jalpaiguri accident : పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రభుత్వ ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన నిలిపి ఉంచిన భారీ ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర దుర్ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగంగా ఉండటంతో ముందు భాగం పూర్తిగా నలిగిపోయింది.
🚨 Siliguri–CoochBehar NBSTC bus collides with a trailer on NH31 at Ulladabri near #Maynaguri; several injured. pic.twitter.com/9euXC8v0rf
— I Love Siliguri (@ILoveSiliguri) June 21, 2026
పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NBSTC)కు చెందిన బస్సు ఆదివారం ఉదయం ప్రయాణికులతో మైనాగురి నుంచి డోమోహని వైపు బయలుదేరింది. బస్సు జల్పాయ్గురి పరిధిలోని ఉల్లదబారి ప్రాంతానికి చేరుకోగానే, రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సు శిథిలాల నుంచి గాయపడిన వారిని, మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన 17 మందిని చికిత్స నిమిత్తం జల్పాయ్గురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు. కాగా, ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్షల కోసం ఆసుపత్రి మార్చురీకి పంపారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, ఈ ఘోర ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రహదారి మొత్తం బురదమయంగా మారింది. వర్షపు నీరు, బురద కారణంగా రోడ్డుపై వాహనాల టైర్లు పట్టు కోల్పోయి జారుతున్నాయి. ఉల్లదబారి వద్దకు రాగానే బస్సు ఒక్కసారిగా అదుపుతప్పిందని, డ్రైవర్ ఎంత ప్రయత్నించినా కంట్రోల్ కాలేకపోవడంతోనే రోడ్డు పక్కన ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టిందని సాక్షులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ ప్రమాద బాధితులకు తగిన సహాయం అందించేందుకు చర్యలు చేపట్టింది.









