missing case

BIG BREAKING :  రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విజయవాడ కృష్ణలంకకు చెందిన గాడే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఏపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులోని తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం.. దీనిపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించేందుకు ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హైప్రొఫైల్ కేసు మిస్టరీని వీలైనంత వేగంగా ఛేదించేందుకు గానూ అత్యున్నత స్థాయి పోలీస్ అధికారులతో ఈ సిట్ బృందాన్ని ప్రభుత్వం రంగంలోకి దించింది.

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఐజీ రవి ప్రకాష్‌ను నియమించారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ కేసు దర్యాప్తు మొత్తం సాగనుంది. పోలీస్ శాఖలో మంచి గుర్తింపు ఉన్న మరో ముగ్గురు కీలక అధికారులను ఇందులో సభ్యులుగా నియమించారు. వారిలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బద్దార్, బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ ఎల్. సుధాకర్ ఉన్నారు.ఈ నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో సాంకేతిక ఆధారాలు, రికార్డులను పరిశీలించి సాయికృష్ణ అదృశ్యం వెనుక ఉన్న అసలు నిజాలను వెలికితీయనుంది.

నాగరాజుపై కఠిన చర్యలు

మరోవైపు ఈ కేసులో మొదటి నుంచి అత్యంత కీలకంగా, వివాదాస్పదంగా మారిన కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్.ఎస్.వి. నాగరాజుపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సాయికృష్ణను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుని వేధించారంటూ వస్తున్న ఆరోపణలు, ప్రాథమిక విచారణ నివేదికల ఆధారంగా సీఐ నాగరాజును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సస్పెండ్ అయిన సీఐ నాగరాజుతో పాటు పలువురిపై హత్య, అక్రమ నిర్బంధం వంటి కఠినమైన సెక్షన్ల కింద కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోనే కేసు కూడా నమోదైంది.

మే నెలలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత అతను ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌లోనే లాకప్ డెత్ జరిగి ఉండవచ్చని, ఆ తర్వాత మృతదేహాన్ని విజయవాడలోని స్వర్గపురి స్మశానవాటికలో రహస్యంగా దహనం చేశారని బాధితుడి తల్లి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు తీవ్ర మలుపు తిరిగింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.