కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కుట్రపూరితంగా వ్యవహరించి ఆమె నామినేషన్ను తిరస్కరించాయంటూ కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గాంధేయవాది, రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తురాలైన మీనాక్షి నటరాజన్కు జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు సముచిత గౌరవం కల్పించేందుకు తెలంగాణ నుండి రాజ్యసభకు పంపేందుకు ఏఐసీసీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది..
ప్రస్తుతం తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీల్లో ఒకరితో రాజీనామా చేయించాలని అధిష్టానం గట్టిగా నిర్ణయించుకుంది. ప్రస్తుతం రాష్ట్రం నుండి అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ, రేణుకా చౌదరిలు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వీరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన వేం నరేందర్ రెడ్డి తన పదవిని త్యాగం చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు కావడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేకంగా చర్చించారు. పార్టీ కోసం, రాహుల్ నమ్మకం కోసం తెలంగాణ నుండి ఒక స్థానాన్ని ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రతిపాదించారు. రేవంత్ రెడ్డి సూచన మేరకు వేం నరేందర్ రెడ్డితో రాజీనామా చేయించి, ఆ స్థానంలో మీనాక్షి నటరాజన్ను ఏకగ్రీవంగా రాజ్యసభకు పంపేలా కాంగ్రెస్ పక్కా ప్లాన్ సిద్ధం చేసింది.
2026 మార్చిలో
వేం నరేందర్ రెడ్డి రాజీనామా అనంతరం మీనాక్షి నటరాజన్ను తెలంగాణ నుండి పెద్దల సభకు పంపే ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా వేం నరేందర్ రెడ్డి 2026 మార్చిలో తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 16న రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.










