Saturday, June 13, 21:16
27.8 C
Hyderabad

DRDO అద్భుత విజయం.. రక్షణ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర!

DRDO
DRDO

భారత రక్షణ రంగంలో అద్భుతమైన మైలురాయి నమోదైంది. జూన్ 10, 11 తేదీల్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ వరుసగా మూడు సార్లు లాంగ్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కొనే క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచిన ఈ ప్రయోగాలతో పాటు, మధ్యస్థ దూరంలోని శత్రువుల నౌకలను తిప్పికొట్టే ఒక సరికొత్త యాంటీ-షిప్ రక్షణ క్షిపణి మొదటి పరీక్షను కూడా శాస్త్రవేత్తలు అంతే విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ రెండు గొప్ప విజయాల పట్ల రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ డీఆర్‌డీఓను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేస్తూ, ఇండియా ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన దేశాల జాబితాలో చేరిందని పేర్కొన్నారు. పొడవైన శ్రేణి, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల నుండి వచ్చే ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొని, దేశాన్ని కాపాడుకునే అరుదైన సాంకేతికత కలిగిన కొద్దిపాటి దేశాల గ్రూపులో భారత్ కూడా చేరిందని ఆయన ప్రకటించారు. అయితే ఈ జాబితాలో ఉన్న మిగతా దేశాల పేర్లను ఆయన నేరుగా ప్రస్తావించలేదు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఎంతో సంక్లిష్టమైన ఇన్ని రకాల పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడానికి రక్షణ రంగ శాస్త్రవేత్తలు, పారిశ్రామిక భాగస్వాములు,  సైనిక దళాలు కలిసికట్టుగా చేసిన కృషిని డీఆర్‌డీఓ ఉన్నతాధికారులు కూడా ఎంతో ప్రశంసించారు.

సుమారు 2,000 కిలోమీటర్ల నుండి

డీఆర్‌డీఓ పరీక్షించిన ఈ రెండు రకాల ఇంటర్‌సెప్టార్ క్షిపణులు సుమారు 2,000 కిలోమీటర్ల నుండి 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల మీడియం, ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ఆకాశంలోనే ముక్కలు ముక్కలు చేయగలవు. ప్రస్తుతానికి ఈ క్షిపణుల పేర్లను ప్రభుత్వం అధికారికంగా బయటకు చెప్పనప్పటికీ, ఇవి భూ వాతావరణం లోపల,  భూ వాతావరణానికి అవతల ఉన్న అంతరిక్షంలో కూడా శత్రువుల దాడులను అడ్డుకునేలా రూపొందించబడ్డాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విజయవంతమైన ప్రయోగాల తర్వాత, ఈ క్షిపణి వ్యవస్థలు త్వరలోనే తదుపరి దశ పరీక్షలకు వెళ్లనున్నాయి.

మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ అభివృద్ధి చేస్తున్న ఫతా-1, ఫతా-2 వంటి లాంగ్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు, చైనాకు చెందిన పి-282 క్షిపణుల ముప్పును దృష్టిలో ఉంచుకునే భారత్ గత కొన్ని సంవత్సరాలుగా తన బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంపై ఎక్కువ శ్రద్ధ పెడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే భూమి లోపల చాలా లోతుగా దాగి ఉండే శత్రువుల రక్షణ స్థావరాలను సైతం బద్దలు కొట్టేలా అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని మార్చే పనులను డీఆర్‌డీఓ గత ఏడాది ప్రారంభించింది.

దేశ రక్షణను మరింత పటిష్టం చేస్తూ ఇటీవల ఏప్రిల్ నెలలో ఐఎన్ఎస్ అరిదమన్ అనే సరికొత్త అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామిని కూడా నౌకాదళంలోకి చేర్చుకున్నారు. ఇది భారత్ మూడవ అరిహంత్ క్లాస్ జలాంతర్గామి, ఇది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులపైకి అణ్వాయుధాలను ప్రయోగించగలదు. శత్రువుల కాంక్రీట్ కోటలను, భూగర్భ బంకర్లను సైతం దూల్చేసే సరికొత్త శక్తివంతమైన క్షిపణులను తయారు చేయడంలో భారత్ ఇప్పుడు అత్యంత వేగంగా దూసుకుపోతోంది.