
Reserve Bank of India : రుణాలు తీసుకుని అనివార్య కారణాల వల్ల సకాలంలో ఈఎంఐలు చెల్లించలేకపోతున్న కస్టమర్ల పట్ల కొన్ని బ్యాంకులు, రికవరీ ఏజెంట్లు అనుసరిస్తున్న అమానవీయ, వినూత్న వేధింపుల పద్ధతులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సనల్, హోమ్, లేదా కార్ లోన్ల బకాయిలను వసూలు చేయడానికి కస్టమర్ల మొబైల్ ఫోన్లను డిసేబుల్ చేయడం లేదా వాటి పనితీరును నిలిపివేయడం వంటి డిజిటల్ వేధింపులకు స్వస్తి పలకాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు రికవరీ ఏజెంట్ల ప్రవర్తనను నియంత్రించడానికి, వసూళ్ల ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని అడ్డుకోవడానికి కఠినమైన మార్గదర్శకాలతో కూడిన సరికొత్త మాస్టర్ డైరెక్షన్ (ముసాయిదా)ను కేంద్ర బ్యాంకు విడుదల చేసింది.
బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతను పెంచేందుకు, రుణగ్రహీతల హక్కులను కాపాడేందుకు ఆర్బీఐ ప్రతిపాదించిన ఆ ముసాయిదాలోని ముఖ్యాంశాలు, సమగ్ర వివరాలు ఇలా ఉన్నాయి.
1. స్మార్ట్ఫోన్ల డిజిటల్ బ్లాకింగ్పై కఠినమైన ఆంక్షలు
సాధారణ అవసరాల కోసం తీసుకున్న పర్సనల్, హోమ్, కార్ లోన్ల రికవరీ కోసం కస్టమర్ల వ్యక్తిగత ఫోన్లను లేదా టాబ్లెట్లను టెక్నాలజీ ఆధారంగా బ్లాక్ చేసే హక్కు బ్యాంకులకు లేదు. అయితే, ఒకవేళ సదరు మొబైల్ ఫోన్ను కొనుగోలు చేయడానికి సదరు బ్యాంకే ప్రత్యేకంగా లోన్ ఇచ్చి ఉంటే, అప్పుడు మాత్రమే దాన్ని బ్లాక్ చేయడానికి బ్యాంకుకు అనుమతి ఉంటుంది. కానీ, దీనికి కూడా ఆర్బీఐ కింది నిబంధనలను విధించింది:
90 రోజుల గడువు: లోన్ ఈఎంఐ చెల్లించకుండా కస్టమర్ వరుసగా 90 రోజులు దాటిపోయి (90 days past due) డిఫాల్ట్ జాబితాలోకి చేరాలి. ఆ తర్వాత బ్యాంకు అధికారికంగా నోటీసులు జారీ చేసినప్పటికీ కస్టమర్ స్పందించకపోతేనే ఫోన్ బ్లాక్ చేసే చర్యలు చేపట్టాలి.
అత్యవసర సేవలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకూడదు: ఒకవేళ నిబంధనల ప్రకారం ఫోన్ బ్లాక్ చేసినప్పటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇన్కమింగ్ కాల్స్, అత్యవసర ఎస్ఓఎస్ (Emergency SOS) ఫీచర్లు, ప్రభుత్వ పబ్లిక్-సేఫ్టీ నోటిఫికేషన్లు వంటి అత్యవసర సేవలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదు.
2. అన్లాక్ చేయడంలో ఆలస్యమైతే బ్యాంకులకు ‘గంటకు రూ. 250’ జరిమానా!
రుణగ్రహీత తన బకాయిలను లేదా లోన్ ఈఎంఐలను బ్యాంకుకు చెల్లించిన వెంటనే (Default Cure చేసిన వెంబడే), గరిష్టంగా ఒక గంట వ్యవధి లోపు సదరు మొబైల్ ఫోన్పై విధించిన అన్ని రకాల ఆంక్షలను బ్యాంకులు వెంటనే తొలగించాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు ఏదైనా పొరపాటున లేదా తప్పుడు కారణాలతో కస్టమర్ ఫోన్ బ్లాక్ చేసినా.. లేదా బకాయిలు చెల్లించిన తర్వాత కూడా గంట లోపు అన్లాక్ చేయడంలో విఫలమైనా.. సదరు బ్యాంకు కస్టమర్కు ప్రతి గంట ఆలస్యానికి రూ. 250 చొప్పున పరిహారం (Fine) చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ ప్రతిపాదించింది.
3. రికవరీ ఏజెంట్ల ‘కఠినమైన పద్ధతులు’ (Harsh Methods) పూర్తిగా నిషేధం
కస్టమర్లను సామాజిక మాధ్యమాల ద్వారా అవమానించడం, బూతు పదజాలం ఉపయోగించడం వంటి రికవరీ ఏజెంట్ల తీరుపై వచ్చిన ఫిర్యాదులను ఆర్బీఐ సీరియస్గా తీసుకుంది. రికవరీ ప్రక్రియలో క్రింది పద్ధతులను చట్టవిరుద్ధమైన ‘కఠినమైన పద్ధతులు’గా పరిగణించి పూర్తిగా నిషేధించింది:
కస్టమర్లను లేదా వారికి షూరిటీ ఉన్న హామీదారులను (Guarantors) బెదిరించడం, భయపెట్టేలా మాట్లాడటం లేదా అసభ్య పదజాలంతో దూషించడం.
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో రుణగ్రహీతల ఆడియో, వీడియో రికార్డింగులు లేదా వారి వ్యక్తిగత వివరాలను పోస్ట్ చేసి పరువు తీయడం.
మొబైల్ లేదా సోషల్ మీడియా యాప్స్ ద్వారా అసభ్యకరమైన, వేధించే మెసేజ్లు పంపడం.
కస్టమర్ల దైనందిన జీవితానికి ఇబ్బంది కలిగించేలా పరిమితికి మించి మితిమీరిన కాల్స్ లేదా సందేశాలు (Messages) చేయడం.
4. రికవరీ కాల్స్ రికార్డింగ్ & కంటెంట్ భద్రపరచడం తప్పనిసరి
భవిష్యత్తులో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం మరియు పారదర్శకత కోసం, బ్యాంక్ ఉద్యోగులు లేదా రికవరీ ఏజెంట్లు కస్టమర్లకు చేసే ప్రతి కాల్ సమయం, మరియు కాల్స్ సంఖ్యను బ్యాంకులు తప్పనిసరిగా రికార్డు చేయాలి. కేవలం కాల్ డేటా మాత్రమే కాకుండా, ఆ కాల్స్లో ఏం మాట్లాడారనే (ఆడియో/టెక్స్ట్) కంటెంట్ను కూడా బ్యాంకులు భద్రపరచాల్సి ఉంటుంది. ప్రతి బ్యాంకుకూ ప్రత్యేక రికవరీ పాలసీ ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించే థర్డ్ పార్టీ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
అమలు, గడువు వివరాలు:
ఈ సవరించిన విప్లవాత్మక నిబంధనలను అక్టోబర్ 1, 2026 నుంచి అమలు చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ ముసాయిదాపై స్టేక్హోల్డర్లు, బ్యాంకింగ్ నిపుణులు మరియు సాధారణ ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను మే 31 వరకు కేంద్ర బ్యాంకుకు తెలియజేయవచ్చు. ఈ సరికొత్త నిబంధనలు కేవలం పెద్ద కమర్షియల్ బ్యాంకులకు మాత్రమే కాకుండా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs), కోఆపరేటివ్ బ్యాంకులు, మరియు అన్ని రకాల ఎన్బీఎఫ్సీ (NBFC) రుణ విక్రయ సంస్థలకు కూడా పూర్తిగా వర్తిస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.









