పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్ సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ భారీ బల్క్ క్యారియర్ (కార్గో) నౌకపై ఆదివారం భీకర దాడి జరిగింది. ఖతార్ రాజధాని దోహాకు ఈశాన్యంగా సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని డ్రోన్ లేదా క్షిపణి బలంగా ఢీకొనడంతో సరకు రవాణా చేస్తున్న ఆ నౌకలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. బ్రిటిష్ మిలిటరీకి చెందిన యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ నౌకలో ఉన్న సిబ్బంది అలెర్ట్ అయ్యారు. సక్సెస్ఫుల్గా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ దాడి ఎవరు చేశారనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటిదాకా ఏ ఉగ్రసంస్థ లేదా దేశం ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. అయితే ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నౌకపై జరిగిన దాడిని ఖండించింది. వాణిజ్య, పౌర నౌకలను టార్గెట్ చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని మండిపడింది.
మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుతం తాత్కాలికంగా కాల్పుల విరమణ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఈ దాడి జరగడం కలకలం రేపుతోంది. గత కొన్నిరోజులుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా విధిస్తున్న బ్లాకేడ్ను ఉల్లంఘించడానికి యత్నించాయనే ఆరోపణలతో గత శుక్రవారం రెండు ఇరాన్ చమురు రవాణా నౌకలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. దీనిపై స్పందించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్.. తమ నౌకలపై దాడులు చేస్తే అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇలా హెచ్చరించిన మరుసటి రోజే తాజాగా నౌకపై దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.







